Saturday, August 17, 2019

టూటే హువా ఖ్వాబ్


ఇరిగి పోయిన కలలు
ఎన్నో నేర్పించాయ్
ఎద పొందినదాన్నేదో
కళ్ళు పోగొట్టుకున్నాయ్

శైలేంద్ర గొప్పగా చెప్పాడు కదూ. బహుశా ఒకే ఒక్క శైలేంద్ర మాత్రమే చెప్పగలడు అనుకుంటా. అనుకుంటా ఏమిటి. శైలేంద్రనే చెప్పగలడు. అతడొక్కడే చెప్తాడు గనుకే, తాగుతూ ఏదో రాసుకుని బార్  చెత్తకుండి లో విసిరేసిన కాగితాన్ని ఏరి మరీ బాణీ కట్టుకున్నారు. నేనంటే నేనని పరుగులు పెట్టారు. అయితే ఇప్పుడు శైలేంద్ర గురించి రాయట్లేదు. అతడి వాక్యాల్లో నన్ను నేను వెతుక్కున్నాను.

"ఎద పొందిన దాన్నేదో, కళ్ళు పోగొట్టుకున్నాయ్". నేనూ అంతే కదూ. ఎద పొందిన అనేకాల్ని ఇంకా వెతుకుతున్నాను. కానీ, ఎక్కడా? ఏవీ కంటికి కనరావే. అనేకం వరకేందుకు. నువ్వు? నువ్వు మాత్రం ఎదలో తప్ప, జ్ఞాపకాల్లో తప్ప కంటికి కనబడుతున్నావా? లేదు కదా. శైలేంద్ర మేరే దిల్ కె మెహ్మాన్ అంటాడు. నువ్వూ అంతే కదూ. దిల్ కి మోహల్లాలో కొన్నాళ్ళుండి, తిరగాడి జ్ఞాపకాలను వొదిలిపోయిన అథితివి. వొచ్చిపోయిన అథితీ ఇప్పటికి మనం తిరగాడిన జాగలకు నేనెప్పుడైన వెళితే యాదికొస్తావ్. మనం ఎప్పుడూ కూర్చునే చోటే కాసేపు కూర్చొని వస్తాను. నీ యాదుల్లో ఆ కాసేపు తడచిపోతాను.

ఈ మధ్య నల్లమల పొయొచ్చాను. అభివృద్ధి అంటేనే విధ్వసంమని అనేకానేక సార్లు మాట్లాడుకున్నాం కదూ. ఇప్పుడూ అంతే. మానవ విధ్వంసక యురేనియం వెలికితీత కోసం అక్కడి చెంచులను తరిమేయబోతున్నారు. యురేనియం చేసిన విధ్వసం నీకు తెలియంది కాదు. ఫుకుషిమా గురించి ఎంత మాట్లాడుకున్నాం. ఇప్పటికీ ఫసిఫిక్ లో చేపలు రేడియాక్టివ్ గానే ఉన్నాయని రిపోర్ట్స్ వచ్చాయి. ఒక విధ్వంసం చేయడానికి మరొక విధ్వంసానికి పాల్పడుతున్నారు పాలకులు.

మొన్న పోయినప్పుడు శీలం బయ్యన్న (నల్లమల చెంచు) మాట్లాడుతూ... "నేను ఒక్కణ్ణే అడవిలోకి పోతా, నాక్కొన్ని పసులున్నాయ్. నేను అడివిలో వాటిని మేపుతుంటే, పెద్దపులి మా పక్కనుండే పోయింది. అది మమ్ముల ఏమనది. పెద్దపులి మా బిడ్డ. మేము దాని బిడ్డలం. ఏది మమ్ముల అడవిలకెళ్లి ఎల్లగొడుతా అన్నోడు వచ్చి అడివిల రెండురోజులు ఉండుమను సూద్దాం. మా లెక్కన అడివిల ఒక్కణ్ణే తిరుగుమను సూద్దాం." అన్నాడు. నిజమే కదూ. తనది కానీ నేలలో ఎవడైనా ఎట్లా యథేచ్ఛగా తిరగగలడు. అంతేనా... "మమ్మల్నంటే ఎళ్లగొడుతరు. మరి పెద్దపులులను, జింకలను, దుప్పులను, ఎలుగొడ్లను, మెకాలను, ఇంకా నూటొక్క తీరు జంతువులను ఏడికి కొంతబోతరు" అనీ అడిగారు. సమాధానం ఎవరు చెప్తారు. ఏ ప్రభుత్వాల దగ్గర సమాధానం ఉంది. మొదట పులుల అభయారణ్యం అని మనుషులను, తరువాత యురేనియం ఉందని పులులనూ ఎల్లగొడుతున్న వాండ్లు ఏమని చెప్తారు. ఎవరికి చెప్తారు.

మనం మాట్లాడితే మానవీయత అంటాం కదా. కానీ, ఈ చెంచులు మనం చెప్పే 'మానవీయత' పరిధిని దాటిన ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఒక్క మనిషినే కాదు. చెట్టును, పుట్టను, పక్షిని, పశువును, చివరకు మనం కౄర జంతువు అనే పెద్దపులిని బిడ్డగా చూసుకునే, చెప్పుకునే గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు లింగ్విస్ట్ లు ఓ కొత్త పదాన్ని కాయిన్ చేయాలి. నాగరికత నిర్ణయించిన 'మానవీయత' పరిధిలో గాక, మొత్తం ప్రకృతిని తమ అని భావించే ఆదివాసులను గురించి చెప్పేందుకు ఒక కొత్త పదాన్ని కాయిన్ చేయాలి. అంతగొప్ప మనుషులు ఇప్పుడు వాళ్ళ నేల నుండి బేదఖల్ అవుతున్నారు. ఇదొక నల్లమల గాయమేనా? కాదు. అడివున్న చోటల్లా ఇదే కథ. అడివిని, అక్కడి మనుషులను ఏనాడు పట్టించుకోని ప్రభుత్వాలు ఇప్పుడు అభివృద్ధి అంటూ అడవి బాట పడుతున్నారు. ఎవరి అభివృద్ధి? అభివృద్ధి ఖరీదు ఒక నాగరికతా? ఈ దేశం కన్నా, ఈ ప్రభుత్వాలు, చట్టాలు, రాజ్యాంగాల కన్నా పూర్వపు నాగరికతా?. చెట్లు, పుట్టలు, పశువులు, జీవరాశులు అన్నీ అన్నీ కనుమరుగై అక్కడో విషం నేలనుండి బయటకి తీయబడుతుంది. తన పురిట్లోనే ఒక నాగరికతను, పచ్చదనాన్ని బలిగొనే విషం కాస్త ఫ్యూరిఫై అయి సమస్త మానవాళిని బలిగొంటుంది.

శైలేంద్ర రాతను రఫీ పాడుతుంటే నీతోపాటే నల్లమలా యాదికొచ్చింది. నువ్వు గుర్తొస్తే మనం తిరగాడిన చోటుకు పోయి రాగలను. అక్కడే కాఫిడే లో మనకిష్టమైన ఫ్లేవర్డ్ కాఫీ తాగగలను. అదే ఫ్లై ఓవర్ మీద బండి నడుపుకుంటూ వెళ్లగలనూ. మనం గడిపిన సముద్ర తీరంలో కూర్చొని నిన్ను యాది చేసుకుంటూ మనకిష్టమైన పాటల్ని ఇయర్ ఫోన్ లో వినగలను. కానీ, ఒక్కసారి తన నేల నుండి విసిరేయబడినవారు వారి నేలను మళ్లీ చేరుకోవడం కుదరదు. అక్కడున్న తమ పూర్వీకుల యాదుల్ని తరచి చూసుకోనూ లేరు. తామొకనాడు ఉన్న నేల ఇప్పుడు పరాయిదైపోతుంది. ఆ నేలలో పుట్టుకొచ్చిన విషపు కంపెనీల చుట్టూ సాయుధ పహారా ఉంటుంది. ఇక్కడొక ఊరుండేది. అందులో మనుషులుండేవారు. ఈ నేలపై కొన్ని గురుతులుండేవి. అని చెబితే తప్ప ఎవరికీ తెలియదు. వాళ్ళ ఎద పొదుముకున్న జ్ఞాపకాలేవీ ఇక కళ్ళముందు కనపడవు. కనీసం పోయి చూసుకుందామన్నా వాటి ఆనవాళ్ళూ ఉండవు. అందుకేనేమో శైలేంద్ర 'ఇరిగిపోయిన కలలు ఎన్నో నేర్పించాయ్' అన్నాడు.

నిజమే. ఇరిగిపోయిన కలలు చాలా నేర్పించాయ్. ఎదలో నిండిన నీవు కనుచూపుమేరలో లేవు. ఏ గాఢనిద్రలోనో నువ్వు యాదికొస్తే ఉలిక్కిపడి నిద్రలేస్తాను. తరువాతిక నిద్ర పట్టదు. ఇప్పుడు అక్కడి జనాల పరిస్థితీ అదే. ఊరు పోతుందని నిద్ర పట్టడం లేదన్నారు. కళ్ళు కనపడని ముసలావిడొకర్తి ఊరు వొదిలి పోయేవాళ్ళు తనను వెంట తీసుకుపోతారో లేదోనని అన్నం తినడం మానేసింది.

ఎదలో నిండింది. దేహంలో, ఆలోచనల్లో భాగమైంది కళ్లకు కనపకుండా పోవడం విషాదం కదూ. శైలేంద్ర పాటను బతుక్కి అన్వయించుకుంటే నువ్వు యాదికొచ్చావ్. వెళ్తూ వెళ్తూ నువ్ చూసిన చూపు యాదికొచ్చింది. నల్లమలా, అక్కడి మనుషులు, వాళ్లతో మాట్లాడిన మాటలూ యాదికొచ్చాయ్. అట్లా యాదికొచ్చిన ఒక్కో యాదిని నిదురపట్టక ఇలా రాశాను.

Friday, July 26, 2019

మరణాంతర కలవరింత

నువ్వెళ్ళి పోయావ్. అంతా వెళ్ళిపోయింది. నువ్ వెళ్ళిపోయాక. ఓ కారుచీకటి వచ్చి చేరింది. నా కాళ్ళ కింద నేలే పైకి దుమ్ములా ఎగిసి నన్ను తనలోకి లాక్కుంది. నేనూ నేల ఐక్యమై పోయాక, నేల నా సమాధిగా మారిపోయాక ఆకాశం దాని మీద దుప్పటయ్యింది. ఇప్పుడు నేను నేల వేరుకాదు. నేనూ ఆకాశమూ వేరు కాదు. నేలా ఆకాశమూ అంతే. ఏది వేరుకాదు. అంతా ఒక్కటే. నేలపొరల్లో నేను. నాపై నేల. నేలపై ఆకాశం. అంతా నువ్వెళ్ళిపోయాకే.

అప్పుడప్పుడూ నేల పొరల్లో మెలకువ వచ్చినప్పుడు అనుకుంటాను. ఇంతకీ నేల నన్ను లాక్కుందా? నేనే నేలలోకి చొచ్చుకు పోయానా అని. ఏదైతేనేం తానెళ్ళిపోయాక అని ఓ ఇసుకరేణువు సమాధానమిస్తుంది. అంతేకాదు. నువ్వేమి ఇట్లా అనుకున్న మొదటివాడివి కాదు కదా చివరివాడివి కూడా కాదు అని తన అనుభవంతో చెబుతుంది. ఇప్పుడు నేనూ ఇసుక రేణువులు మంచి దోస్తులం. నేను నా జ్ఞాపకాల్ని, అది తన అనుభవాల్ని పంచుకుంటూ ఉంటున్నాం. అంతా నువ్వెళ్ళిపోయాకే.

జబ్ దిల్ హి టూట్ గయా అంటూ సైగల్ తాగకుండా ఆర్డీ కోసం ఒకేఒక్క పాట పాడాడు. ఆ పాట గుర్తొస్తే అనిపించేది. హృదయమే బద్దలయ్యాక బతికి ఇంకా చేసేదేముందని. అయినా పగిలిన హృదయంతోనూ ప్రేమించాను కదూ. ఏమైంది. ఎక్ దిల్ కి తుక్డే హజార్ హుయే అన్నట్లుగా మళ్ళీ మళ్ళీ ముక్కలయ్యింది. ముక్కలైన ప్రతీసారి ముక్క ముక్కను ఏరి ఓ వాక్యం కుట్టాను. గట్టిగా శ్వాస ఎగబీలిస్తే పెకిలిపోయిన కుట్లలా వాక్యమూ అస్తవ్యస్తమైంది. చెల్లాచెదురైంది. అంతా నువ్వెళ్ళిపోయాకే.

తుమ్ గయే, సబ్ గయా అని పాడుకునేందుకు ఇప్పుడు నేనూ లేను. "నే నిదరోయే చోటుకు ఎవ్వరికీ అనుమతిలేదు. ఒక్క మధుపాత్రతో వచ్చు సాకీకి తప్ప" అని గాలిబ్ అన్నాడో, మీర్ తఖీ మీర్ అన్నాడో యాదిలేదు. నేనూ ఈ మట్టిపొరల్లో కలత నిద్దురలో అదే కలవరిస్తున్నాను. నాదైన చోటుకు ప్యాలతో నడిచొచ్చే సాకీకై. తనుపోసే సాకకై.

Thursday, July 4, 2019

నడిరేయి పాట



సాకీ

ఈ రేయి ఓ పాటను
పాడటం మొదలెట్టింది


వినపడుతోంది
కిటికీ చప్పుడులో
నీ నామస్మరణ


నీవే పంపినట్లుగా
నా దరికి చేరిన గాలిలో
నీ దేహ పరిమళం


అలిగి విసురుగా నువ్ తిరిగితే
తాకిన చీర కొంగులా
మొహన్ని తాకిన పరదా


మరిచిపోయిందేదో
గుర్తుచేస్తూ
క్యాలెండర్ లో
మారిన తేదీ


ఈ నడిరేయి
నేనూ
నాకు తోడుగా
మధుపాత్ర


చిత్రంగా
కిటికీలోంచి చూస్తూ
నాలాంటి
ఒంటరి చుక్క


పక్కన లేనిది నీవే
పదిలంగానే ఉన్నాయ్
నీ జ్ఞాపకాలింకా

ఈ నడి రేయి
వినిపిస్తున్న పాటలాగా

Tuesday, July 2, 2019

ప్రేమలేఖ 34


"కొందరు వర్షంలో తడుస్తారు. మరికొందరు దాన్ని ఆస్వాదిస్తారు" అంటాడు బాబ్ మార్ల్. నిజమే. మొన్నటిదాకా ఉక్కపోసిన ఎదను ఇప్పుడు వర్షం తడిపింది. వర్షం తడిపిన ఎద పురా జ్ఞాపకాల యుద్ధభేరి మోగిస్తుంది. దేహాన్ని తడుపుతున్న ఒక్కో చినుకు తుడుం మోతలా జ్ఞాపకాల్ని తట్టిలేపుతుంది. చినుకులకు తోడుగా వచ్చే చల్లని గాలి స్వెట్టర్ ను చీల్చుతూ దేహాన్ని వణికిస్తోంది. ఒకనాటి మన తోవ, వర్షము, చల్లని గాలి, తుడుమై మొగుతున్న ఎద నిన్ను యాదికి తెస్తున్నాయి.

అదే తోవలో ఎన్నిసార్లు అట్లా వర్షంలో తడుస్తూ వచ్చుంటాం! ఇంటికి రాగానే కాస్త ఫ్రెష్ అయి, అలా వణుకుతూనే చాయ్ పెట్టేవాడ్ని.'రెండు కప్పుల్లో ఏమోద్దు, పెద్దదాంట్లోనే తీసుకురా' అనే నీ ఆజ్ఞ కిచెన్ లోకి వినపడేది. చాయ్ తీసుకొని నేనలా గోడకు అనుకుని కూర్చుంటే, గూటిలో గువ్వపిల్లలా ఒడిలో ఒదిగిపోయేదానివి నా చేతిలో చాయ్ కప్ లాక్కుంటూ. వర్షానికి తడిసి, మంచులా మారిన రెండు దేహాలు ఆ చాయ్ కప్పులో కాస్త, కౌగిల్లో కాస్త వేడిని వెతుక్కునేవి.

ఇప్పుడు ఇంటికి వస్తే నువ్వు లేవని వెక్కిరిస్తూ ఖాళీ రూమ్ లోని పుస్తకాల షెల్ఫ్, తెరచున్న కిటికీలోంచి వస్తున్న చల్లని గాలి. ఈ చలినుండి తప్పించుకోవడానికి ముచ్చట చెప్పె ముసలోడు లేడు. చర్చలు ఎక్కువవుతున్నాయని 'ముసలోడిని' ఇంట్లో పెట్టుకోవడం లేదు. ఈ మధ్య ముసలోడి నుండి విడిపోయి 'పెక్కుకాలపు' మత్తులో ముచ్చటాడుతున్న. ఇక చర్చలు తగ్గిస్తానని మొన్నే 'సాకీ'కి మాటిచ్చా. చర్చల్లో పడి తినట్లేదని తిట్టి, దానికి తోడు మందుల బాక్స్ లో  antacidsని తీసి టేబుల్ మీద పెట్టి మరి టైమ్ కి తినమని వార్నింగ్ ఇచ్చిపోయింది.

ఎదలో ఎదో పురా యుద్ధభేరి ఇంకా మొగుతూనే ఉంది. బహుశా అది ఈ రాత్రంతా మొగుతూనే ఉంటుందేమో! యుద్ధభేరి నేపథ్యగానంలో నీవు లేని చోట నీ జ్ఞాపకాల్ని పలవరిస్తున్నాను. అట్లా పలవరిస్తున్న వాటినే ఏదో ఓ రోజు నువ్ చదువుతావని ఇలా రాస్తున్నాను. ఈ రాత్రీ అనేక రాత్రుల్లాగే నీ జ్ఞాపకాల్లో కాలిపోనుంది. నను కాల్చనుంది. కొన్ని గాయాలు అంతేనేమో...!

Tuesday, June 18, 2019

పున్నమి నాటి వెన్నెల

మబ్బుల చీల్చుకు వస్తావ్
బతుకు చీకటైన ప్రతీసారి

ఒక్కోసారి ఎంత పిలిచినా రావు
నీ రాక లేని రోజుకు అమాస అని పేరేమో

చూస్తూనే ఉంటాను నీ కదలికల్ని
జగ్ మగాతి సడ్కొంపే ఆవారానై తిరుగుతూ

చేతికి అందినట్టే అంది
పెదాలు తాకే లోపే వెళ్లిపోతావ్
నీళ్లలో నీ బింబాన్ని వదిలేస్తూ

రాత్రంతా
నిన్ను కళ్ళలో నింపుకునెందుకు
పగలంతా నిదురపోతాను

ఇప్పుడూ అంతే నిన్ను చూడాలని
టెర్రస్ ఎక్కానా
నువ్ మబ్బుల్లో దాగుతూ దోబూచులాడుతూనే ఉన్నావ్

సాకీ
తెచ్చుకున్న ప్యాలా అయిపోవొచ్చింది

నువ్వొస్తే కొసరి కొసరి ఇవ్వాలని
దాచి ఉంచాను
మత్తు మోహపు మాటలల్లో కాసింత ప్రేమను

ఎప్పటిలాగే
ఆ నలుపు పరదాల్ని
దాటుకు రావూ

(Surya Chandra DG ఇదిగో నువ్ రాయమని అడిగిన కవితా.)

Monday, June 10, 2019

ప్రేమలేఖ 33



కొన్ని శతబ్దాలుగా నిద్రలేనట్లుగా ఓ మానవి వచ్చి ఒళ్ళో తల వాలుస్తుంది. మగతలోనే చేయినలా లాక్కొని ఎదపై వేసుకుంటుంది. నన్ను జో కొట్టవూ అనేందుకు చిహ్నమేమో!. కొట్టి కొట్టనట్లుగా, తాకి తాకనట్లుగా, చప్పుడూ రాకుండ నాలుగు వేళ్లనలా ఆడిస్తుంటే మాట్లాడుతో, మాట్లాడుతో, వింటూ, వింటూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది.


అంతలోనే ఓ ఉలిక్కిపాటు. ఏ పీడకల వచ్చిందో. జో కొడుతున్న చెయ్యినలా గట్టిగా పట్టుకొని, 'ఇక్కడే ఉన్నావు కదూ' అంటూ.

"Give me your shoulder, ఎన్ని రోజులైంది నీ గుండె చప్పుడు వింటూ పడుకోని".
'ఏమైంది పడుకున్నావ్ కదా!'
"నువ్వోదిలేసి పోయినట్లు కలొచ్చింది".

కలలెప్పుడూ అంతే. మెదడు పొరల్లో అణచేసిన వాటిని మోసుకువస్తాయి. దాచుకున్న భయాల్ని గుర్తుచేస్తాయి. ఇదీ అంతేనేమో. ఏమో నువ్వే చెప్పాలి. అప్పుడు అడగలేదు. ఇప్పుడు అడిగేందుకు పక్కన లేవు.


మళ్లీ అంతే. నిదురపట్టక పక్కపై పొర్లాడుతుంటే ఏవేవో చెదిరిపోయిన కలలు.

నీకు గుర్తుందో? లేదో?. నాకు మాత్రం ఆ ఉదయం ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రతీ ఉదయంలానే దగ్గరకు లాక్కుందామని చేయి చేస్తే మెత్తని దేహానికి బదులు మార్బుల్ నేల తాకింది. ఆ మగతలోనే హాల్ లోకి వచ్చి చూస్తే అక్కడా లేవు. తెరచున్న ఇంటి తలుపు, నువ్ పాలకోసం పోయుంటావ్ అనే సమాధానమిచ్చింది. ఎక్కడా ??? ఎంతసేపయింది??? ఇంకా రావే!!! 'ఓ అర్జంట్ పనుండి పోయా'అంటూ ఓ చిరు సందేశం. ఆ రోజు నిద్రలో నిర్ధాక్షిణ్యంగా వదిలేసిన వెళ్లిన పోకట, మళ్లీ వచ్చింది లేదు. వస్తావన్నా ఒకే ఒక్క ఆశ. ఆ ఆశలోనే రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలు. అంతా ఓ కలలా కళ్ళముందు కదలాడుతూ.

అంతే. ఇప్పుడూ అంతే. ఏదో ఓ పిలుపు. ఉలిక్కిపాటు. కల చెదిరిపోయింది. ఇప్పటిదాకా కలగా కలవరించినదాన్ని ఇలా పలవరిస్తున్నాను.


కలలు ఎప్పుడూ చెదిరిపోతాయా? కలసి కన్న కలలే కాదు. కనాలనుకున్న కలలూ అంతేనా? నీలాగే ఓ అర్థరాత్రి నిద్రలోనే మాయమయ్యింది. ఏదీ మళ్లీ రాదే. మళ్లీ అదే ఆశ. వస్తుందనే ఆశ. వొట్టి పిచ్చి ఆశ. ఆ ఆశే కదూ మనిషిని బతికేంచేది. నడిపించేది.

Friday, May 24, 2019

ప్రేమలేఖ 32



నీకు ఓ లేఖ రాద్దాం అని కూర్చున్న. ఎలా మొదలుపెట్టాలి. ప్రియాతిప్రియమైన పిల్లకి అని రాద్దాం అనుకున్న. కానీ, అది రాసి మరీ చెప్పాలా? నీకు తెలియదూ నాకు నీవెంత ప్రియమైనదానవో.

సాకీ...
నువ్వు లేని కాలమంతా ఒంటరిగా గడుపుతూ, ఓ సహారా కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఇప్పుడు అంతే. నువ్వు పక్కన లేవు. మళ్ళీ ఓ సహారా కావాలి. ఎప్పటిలానే పెక్కుకాలపు మత్తుకు తోడు నీ యాదులే సహారా అయ్యాయి.


ఇప్పుడు ఒక మైదాన యుద్ధ బీభత్స భయం అందరిని వెంటాడుతుంది. ప్రశ్న ఎప్పటిలానే వధించబడుతుంది. పాత ప్రశ్నలు ఇంకా సంకెళ్లనుండి విడివడే అవకాశం 'అచ్చేదిన్'లానే ఉన్నది. అప్పుడే మాట్లాడుకున్నట్లు 'అఖ్లాక్'లు ఇప్పుడు సర్వనామం. ఇంకా ఎన్ని ఘోరకళులను చూడనున్నదో ముందుకాలం. నేర్చుకోవాల్సినవారు చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోనంత కాలం విజయం ఫాసిజానిదే. ఇప్పుడిక హిందూ వేరు, హిందుత్వ వేరు అనే 'కుల'పలుకుల లిబరళ్లకు కాలం చెందింది. రాడికల్ హిందుత్వ, సాఫ్ట్ హిందుత్వ ఐక్యత చూశాక కూడా ఆ మాట అంటే ఏమనాలో కూడా చరిత్ర నిర్ణయిస్తుంది. తెలంగాణ ఇంకా ఆర్యసామాజిక ప్రభావం నుండి బయటపడలేదు. రామానుజాచార్యుల బోధనలనుండీ బయటపడలేదు. రామానుజుడు ఏమి చెప్పాడో లోతుల్లోకి పొదలచుకోలేదు. కానీ, రాష్ట్రాన్ని నడిపిస్తున్న రామానుజుని గురించి మాట్లాడాల్సిందే. ఇక్కడ రాజ్యమేలు వైష్ణవ ఫాసిజం గురించీ మాట్లాడాల్సిందే. ఒక్కమాటలో హిందూ అనే గంపగుత్త అస్తిత్వం కింద వైష్ణవోన్మాదాన్ని కప్పిపెట్టలేను.


కొన్ని దేహాలిప్పుడు
యుద్ధ పిపాసులు
కనిపించినదాన్నల్లా కబళించే
కొత్త జంతువులు

సాటి మనిషినే చంపుకు తినే
'కార్నివోరస్'లు


సాకీ...
జంట కమ్మలో రాసిన
ప్రేమలేఖ సాక్షిగా
పల్ బార్ కే లియే
ఇన్ ఆఖోమే హమ్ ఎక్ జమానే డూండేంగే
న్యాయం వర్ధిల్లు సమాజం కోసం కలిసే పోరాడుదాం
పాశ్ అన్నట్లు 'పోరాటం అవసరమున్నంతవరకు పోరాడుదాం'